హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ఫేక్ వీడియో ప్రస్తుతం వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్గా మారిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై పలువురు ప్రముఖులు ఇప్పటికే స్పందించారు. టెక్నాలజీ దుర్వినియోగంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఓ నేషనల్ ఛానెల్ నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. రష్మిక మార్ఫింగ్ వీడియో గురించి ప్రస్తావించారు.
అదో అవమానకరమైన చర్యగా అభివర్ణించారు. నటి రష్మిక మందన్నా డీప్ఫేక్ వీడియో గురించి వార్తల్లో చూసినట్లు చెప్పారు. అదో చేదు అనుభవమని.. ఓ సెలబ్రిటీని ఈ విధంగా కించపరచడం నిజంగా దారుణమని అన్నారు. ఇలాంటి ఘటనల కట్టడికి చట్టపరంగా చర్యలు తీసుకువస్తే వాటిని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలపై భారత ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.