ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలో టీడీపీని గెలిపిస్తే మన వేలితో మన కంటిని పొడుచుకున్నట్లేనని అన్నారు.13 స్థానాల్లో పోటీచేస్తున్న ఆ పార్టీ చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు.
‘ఎన్నో పెద్ద పెద్ద రాష్ట్రాలకు సాధ్యం కాని 24గంటల నిరంతర విద్యుత్ తెలంగాణ సాధించింది. ఇప్పుడు తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ వన్గా ఉన్నాం. సంక్షేమ రంగంలోనూ మందున్నాం. రైతు బంధు లాంటి పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. సామాజిక పింఛన్లన్నీ రెట్టింపు చేస్తాం. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా లంకాసాగర్కు లబ్ధి చేకూరుస్తాం. సత్తుపల్లి, అశ్వారావుపేటకు సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటిని అందిస్తాం. సింగరేణి భూ నిర్వాసితులకు మార్కెట్ ధర ఇప్పించాలన్న డిమాండ్ నెరవేరుస్తాం. పోడు రైతుల సమస్య అన్ని జిల్లాల్లో ఉంది. వాటిని పరిష్కరిస్తాం. తెలంగాణ ఉద్యమం కోసం క్రియాశీలంగా పనిచేసిన పిడమర్తి రవిని గెలిపించాలి’ అని ఓటర్లను కేసీఆర్ కోరారు.