బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ఇటీవల ఓ నగ్న ఫోటోషూట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నగ్న ఫొటో షూట్ తో అందరినీ ఆశ్చర్యపరిచిన రణ్ వీర్ ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నాడు. గతంలో మహిళలు మాత్రమే ఇలాంటి ఫొటో షూట్లు చేయగా.. భారత్ లో తొలిసారి ఓ పురుషుడు, అది కూడా ఓ స్టార్ హీరో చేసిన ఈ ఫొటో షూట్ చర్చనీయాంశమైంది. రణ్ వీర్ ధైర్యాన్ని అభిమానులు మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం తమ మనోభావాలను దెబ్బతీశాడంటూ అతనిపై విమర్శలు చేస్తున్నారు.
ఈ క్రమంలో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో నగ్నచిత్రాలను పోస్ట్ చేసినందుకు రణ్ వీర్ సింగ్పై ముంబైలోని చెంబూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రణ్ వీర్ పై అశ్లీలత, అసభ్యతకు సంబంధించి 292, 293, 509 సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని 67 (A) సెక్షన్ కింద ముంబైకి చెందిన న్యాయవాది వేదిక చౌబే ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తన ఫొటోల ద్వారా రణ్ వీర్ మహిళల మనోభావాలను దెబ్బతీశారని, వారి నిరాడంబరతను అవమానించారని చౌబే తన ఫిర్యాదులో ఆరోపించారు. ఓ ఎన్జీవోకు చెందిన ఆఫీసు బేరర్ చెంబూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు అందజేశాడు.