బీజేపీ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది… కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వాజ్పేయి ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఎయిమ్స్ కి వెళ్లి వాజ్ పేయి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వాజ్పేయి ఆరోగ్యం విషమించడంతో నేడు జరగాల్సిన అన్ని కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.
మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితి పై ఎయిమ్స్ వైద్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. గత 9 వారాలుగా వాజ్ పేయి ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. గత 24 గంటలుగా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నట్టు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు.